తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ మీద సందర్భం దొరికిన ప్రతిసారీ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. విపక్ష నేతలు చేసే విమర్శలకు కాంగ్రెస్ పార్టీ నేతలు అంతే ధీటుగా సమాధానం చెప్తున్నారు. ముఖ్యంగా.. ఛాన్స్ దొరికిన ప్రతిసారీ సీఎం రేవంత్ రెడ్డి తన నోటికి గట్టిగానే పని చేప్తున్నారు. ఈ నేపథ్యంలో.. మార్చి 15న జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు రెండున్నర గంటల పాటు ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. చాలా విషయాలు ప్రస్తావించటంతో పాటు ప్రతిపక్ష నేతలపై నిప్పులు చెరిగారు.
సమావేశంలోనే మీడియాకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత కూడా జర్నలిస్టులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. తెలంగాణలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. అయితే.. రెండోసారి అధికారంలోకి వస్తే.. ఎవరు సీఎం అవుతారన్నది కూడా ముందే చెప్పేశారు. రెండోసారి కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని.. అప్పుడు కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానంటూ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
అయితే.. ఈసారి బీఆర్ఎస్ మీదున్న వ్యతిరేకతతో రాష్ట్ర ప్రజలు.. కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించారని.. రెండోసారి మాత్రం తమ ప్రభుత్వం మీదున్న ప్రేమతో, తాము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేస్తారని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లు అని రేవంత్ రెడ్డి తెలిపారు.
తమ పనిమీద నమ్మకంతోనే ధైర్యంగా ముందుకెళ్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. తనకు స్టేచర్ కాదు.. స్టేట్ ఫ్యూచరే ముఖ్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తానని పునరుద్ఘాటించారు. మహిళంతా ఇప్పుడు మౌనంగా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకే ఓట్లేస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికలకు ముందు తాను ఏం చెప్పానో అదే జరిగిందని.. ఫ్యూచర్లో కూడా తాను చెప్తున్నదే జరుగుతుందంటూ జోస్యం చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ఇప్పటి వరకు చెప్పింది ఇంటర్వెల్ మాత్రమే.. మిగతా సినిమా తర్వాత చూపిస్తా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మామునూరు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్. వరంగల్ అభివృద్ధి కోసం రూ.6 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రకటించారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని సీఎం రేవంత్ విమర్శించారు. పదేళ్లలో కేసీఆర్ 7లక్షల కోట్ల అప్పులు చేశారని వారు చేసిన అప్పులలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష 53 వేల కోట్లు చెల్లించిందని వివరించారు.
తెలంగాణలో కాంగ్రెస్ సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదన్న హరీష్ రావుకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. కేసీఆర్ లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయిందని, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని, ఏపీ కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే పట్టించుకోలేదని సీఎం రేవంత్ ఆరోపించారు. అసెంబ్లీకి రాని కేసీఆర్కు రూ.58 లక్షల జీతం, పోలీసుల పహారా ఎందుకని సీఎం రేవంత్ ప్రశ్నించారు.