ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఇదివరకు వైసీపీ ప్రభుత్వం చెత్తపై కూడా పన్ను విధిస్తూ వచ్చింది. అప్పట్లో ఎన్నికల్లో (Chandra Babu) చంద్రబాబు.. దాన్ని తప్పు పట్టారు. చెత్త మీద కూడా పన్ను (Garbage Tax) వేసే చెత్త ముఖ్యమంత్రి అని తిట్టిపోశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చెత్త పన్నును రద్దు చేయడం జరిగింది. కానీ నోటిఫికేషన్ జారీ చెయ్యలేదు. ఇప్పుడు జారీ చేసింది. చెత్త పన్ను తీసుకోవడాన్ని ఆపేస్తూ కూటమి ప్రభుత్వం 2024 డిసెంబరులో మున్సిపల్ చట్టాన్ని సవరించింది. ఈ సవరణను ఇటీవల అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పుడు గవర్నర్ అనుమతి కూడా వచ్చి గెజిట్ (Gazette Notification) విడుదలైంది.
ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. నగరాలు, పట్టణాల్లో 31, డిసెంబర్ 2024 నుంచి చెత్త పన్ను రద్దైనట్లే. అందువల్ల ఎవరైనా చెత్తకి పన్ను తీసుకుంటూ ఉంటే.. వారిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాంటి వారిపై ప్రజలు కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఇన్నాళ్లూ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి.. కంప్లైంట్ ఇవ్వడం సమస్య అయ్యేది. ఇప్పుడు నోటిఫికేషన్ రావడంతో.. ప్రజలకు చెత్త పన్ను సమస్య తీరినట్లే.
వైసీపీ ప్రభుత్వం చెత్త సేకరణకు ప్రత్యేక వాహనాలు తెచ్చింది. అలా చెత్త సేకరించేవారు.. ప్రతి నెలా.. పన్ను కూడా వసూలు చేసేవారు. ఇలా గత ప్రభుత్వం చెత్త ద్వారా రూ.187.02 కోట్లు సేకరించింది. ఇది ప్రజలకు నచ్చలేదు. తమ దగ్గర చెత్త తీసుకొని, తమనే పన్ను చెల్లించమనడం ఏంటని వారు ప్రశ్నించారు. అలా నిలదీయడానికి బలమైన కారణం ఉంది.
ప్రభుత్వం తాను సేకరించే చెత్తను తడి, పొడిగా వేరు చేసి.. తడి చెత్తను మొక్కలకు ఎరువుగా, పొడి చెత్తను విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించితే.. భారీగా ప్రయోజనాలు కలిగేవి. కానీ వైసీపీ ప్రభుత్వం అలాంటివి చెయ్యకపోగా, ప్రజల నుంచి మనీ తీసుకుంది. అందుకే ప్రజలు ఎన్నికల్లో తీవ్రంగా వైసీపీని వ్యతిరేకించారు.
కూటమి ప్రభుత్వం ఇప్పుడు జాగ్రత్త పడుతోంది. సేకరించే చెత్తను ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తి, రీసైక్లింగ్ కోసం ఉపయోగిస్తోంది. ఇందుకోసం ఏపీ వ్యాప్తంగా రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ప్రయత్నిస్తోంది. దీని చెత్తను తగలబెట్టేయకుండా.. సరిగ్గా ఉపయోగించే వీలు కలుగుతుంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో విధించిన చెత్త పన్నును ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 31 నుంచి చెత్త పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మున్సిపల్ చట్ట సవరణ తర్వాత గెజిట్ విడుదల చేసింది. ఏపీలో ఇకపై చెత్త పన్ను ఉండదు.
వైసీపీ ప్రభుత్వం (AP Govt)చెత్త పన్నును విధించినప్పటి నుంచి అప్పుడు విపక్షంలో ఉన్న నేతలు విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. ఎన్నికల ప్రచారంలో సైతం ఈ అంశాన్ని అస్త్రంగా వాడుకున్నారు. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేసింది.