సరూర్నగర్ అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకు జీవత ఖైదు విధించింది రంగారెడ్డి కోర్టు. అప్సరను ప్రేమంచి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మోసం చేశాడు పూజారి. అప్సరతో నాలుగేళ్లపాటు ప్రేమయాణం సాగించాడు. పెళ్లి చేసుకోమని వెంటపడటంతో.. శంషాబాద్ ప్రాంతంలో హత్య చేసి.. మ్యాన్హోల్లో మృతదేహాన్ని పడేశాడు. ఈ కేసులో రంగారెడ్డి కోర్టు నేడు తీర్పు వెల్లడించింది. అతడికి జీవిత ఖైదుతో పాటు.. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు అదనంగా మరో ఏడేళ్ల జైలు శిక్షను కూడా విధించింది. వీటితో పాటు.. అప్సర కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తమిళనాడుకు చెందిన అప్సర డిగ్రీ పూర్తి చేసింది. నటన, మోడలింగ్పై ఆసక్తితో ఆమె పలు తమిళ చిత్రాల్లో నటించింది. సినిమా అవకాశాల కోసం ఆమె 2022 ఏప్రిల్లో హైదరాబాద్కు వచ్చింది. కాశీలోని తన తండ్రి ఒక ఆశ్రమంలో పనిచేస్తున్నారు. తల్లితో కలిసి ఆమె సూరూర్నగర్లోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆమె తల్లి ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా.. అప్సర దేవాలయాలకు తరచూ వెళ్తూ ఉండేది. ఆ సమయంలోనే అక్కడ పూజారి సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. తనను పెళ్లి చేసుకోవాలని సాయిపై అప్సర ఒత్తిడి తెచ్చింది. పెళ్లి చేసుకుంటే సరి.. లేదంటే ఇద్దరి మధ్య సంబంధాన్ని భయటపెడతానంటూ ఆమె బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఈ విషయం భయటపడితే పరువు పోతుందని భావించిన సాయి.. హత్యకు ప్లాన్ చేశాడు. నాలుగు సార్లు హత్యకు ప్లాన్ చేసినా.. వర్కౌట్ కాలేదు. ఐదోసారి 2023 జూన్ 3వ తేదీన .. కోయంబత్తూరు వెళ్తున్నట్లు.. విమాన టికెట్లు కూడా తీసుకున్నానని నమ్మించాడు. దీంతో ఆమె తమ లగేజీతో సహా ప్రయాణానికి సిద్ధం అయింది. ఆమె తల్లికి శంషాబాద్లో దించి వస్తానని చెప్పి తన కారులో తీసుకెళ్లాడు. అక్కడ రాత్రి 11 గంటల సమయంలో.. సుల్తాన్పల్లిలోని గోశాల వద్దకు వెళ్లారు.
అక్కడ కొంతసేపు గడిపారు. అక్కడే అతడు ఆమెకు కంటపడకుండా.. బెల్లం దంచే రాయిని తన కారులో వేశాడు. జూన్ 4 తెల్లవారు జామున.. గోశాల సమీపంలోని నర్కుడలోని ఓ వెంచర్ వద్దకు చేరారు. ఆమె నిద్రలోకి వెళ్లగానే.. కారు సీటు కవర్ను ఆమె ముఖంపై వేసి ఊపిరాడకుండా చేశాడు. అప్పటికే తన కారులో ఉంచిన బెల్లం దంచే రాయిని తీసుకొని.. ఆమె తలపై పదిసార్లు బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ఊపిరి వదిలింది.
మృతదేహంపై కారు కవర్ కప్పి.. అక్కడే కారును పార్కు చేసి.. ఏమి తెలియకుండా.. ఇంటికి వచ్చేసి రోజూవారీ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యాడు. రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కవర్లో చుట్టి.. సరూర్ నగరలోని మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్హోల్లో పడేశాడు. అక్కడ వాసన వస్తున్నట్లు గమనించిన అతడు రెండు ట్రక్కుల ఎర్రమట్టి తెప్పించి.. మ్యాన్హోల్లో వేయించాడు. అంతే కాదు.. దానిపై కాంక్రీట్ వేసి పకడ్బందీగా మూసేశాడు.
అప్సరకు గతంలోనూ ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిందని, పెళ్లి చేసుకోవాలని పూజారి సాయికృష్ణపై ఒత్తిడి తెచ్చిందని పోలీసులు తెలిపారు. కారులోనే అప్సరను హత్య చేసినట్లు నిర్ధారించారు.