మహా కుంభమేళాకు ధీటుగా గోదావరి పుష్కరాలు జరపాలనేది ముఖ్యమంత్రి ఆశయం
— ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం తో ముందుకెళ్లాలని సూచన.
— అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి నిమ్మల
** పంచభూతాలలో ఒకటైన జలాన్ని కూడా దైవ స్వరూపంగా భావించే సంస్కృతి, ఆచారం మనది.
** అలాంటి జల ప్రవాహాలకు నెలవైన పుణ్య నదులలో పుష్కర స్నానమాచరించడం పరమ పవిత్రమని మన పురాణాలు చెబుతున్నాయి.
** 12 రోజులు పాటు జరిగే పుష్కరాల్లో స్నానం ఆచరిస్తే 12 సంవత్సరాలు పాటు 12 నదుల్లో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందనేది నమ్మకం.
** భారతీయ సంస్కృతిలో గంగానదికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. భారతదేశంలో గంగా నది తర్వాత అంతటి గొప్ప ప్రాశస్త్యం ఉన్న నది గోదావరి. అందుకనే గోదావరిని దక్షిణ గంగ అని కూడా పిలుస్తారు.
** గోదావరి నదికి 2027 జూలై 27 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు పుష్కరాలు జరుగనున్నాయి.
** రెండేళ్ల వ్యవధి ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి సూచన మేరకు ఇటీవలనే రాజమండ్రిలో పుష్కరాల సన్నాహక సమావేశం జరిపాం. వివిధ అంశాలను చర్చించాం.
** 2003 లోను 2015 లోనూ గోదావరి పుష్కరాలు నిర్వహించే భాగ్యం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కింది. వీటి నిర్వహణలో ఆయనకు అపార అనుభవం ఉంది. అలాగే దేశ స్థాయిలో ఇటీవల జరిగిన ప్రయాగరాజ్ మహా కుంభమేళ అనుభవ పాఠాలు, సమర్థ నిర్వహణ మనకు ఆలంబన కానున్నాయి.
** 2015 గోదావరి పుష్కరాల్లో 3O7 పనులను 117 కోట్లతో చేసాం.
** 3625 మీటర్ల పొడవున 145 ఘాట్లను గుర్తించాం. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో2,452 మీటర్ల పొడవునా 98 ఘాట్లను గుర్తించాము.
** ఘాట్ల నిర్మాణము, మరమ్మత్తులు, వాటర్ మేనేజ్మెంట్, ఇన్ఫ్లో, అవుట్ ఫ్లోలు మాత్రమే ఇరిగేషన్ శాఖ చూస్తుంది. నిర్వహణ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూస్తుంది.
** పుష్కరాలకు సంబంధించి ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలే కాకుండా హోమ్, ఎండోమెంట్, పురపాలక శాఖ, ఆర్ అండ్ బి, ఫిషరీస్, పౌరసరఫరాలు, పర్యాటక శాఖలు పాలుపంచుకుంటాయి.
** ఈ శాఖలన్నీ తరచూ సమన్వయ సమావేశాలు జరుపుకుంటూ సమర్థంగా, ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లి గోదావరి పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు మంత్రి నిమ్మల చెప్పారు.
** సోమవారం నాటి అసెంబ్లీ సమావేశంలో సభ్యులు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు,. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ లు వచ్చే పుష్కరాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు, చేసిన సూచనలకు మంత్రి నిమ్మల స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు.
** 1.2 కిలోమీటర్లు పొడవున్న కోటిలింగాల రేవు ఘాట్ వంటి పుష్కర పనులు శాశ్వత ప్రాతిపదికన చేయాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించగా అందుకు మంత్రి అంగీకరించారు.
** మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను రాజమండ్రి కే పరిమితం చేయకుండా కోనసీమ ప్రాంతంలో గోదావరి పాయలు, అనేక దేవాలయాలు ఉన్నందున కోనసీమ కు కూడా విస్తరిస్తే జన సంద్రాన్ని విభజించినట్లు అవుద్దని చేసిన సూచనకు మంత్రి సానుకూలంగా స్పందించారు.
** కొవ్వూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 30 కిలోమీటర్ల గోదావరి తీరం ఉందని.. అందువల్ల పుష్కరాలకు సంబంధించి కొవ్వూరు ప్రాశస్యాన్ని గుర్తు చేశారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాన్ని ఆయన నొక్కి చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొవ్వూరు ప్రాంతం వైపు పుష్కర భక్తులకు, యాత్రికులకు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా మంచినీటి సదుపాయం పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే దేవాదాయ శాఖ ద్వారా అనేక దేవాలయాలను ఆధునికరించటం, స్వల్ప మరమ్మతులు చేయటం, రంగులు వేయడం వంటి పనులు ఇప్పటి నుంచే చేసుకుంటే బాగుంటుందని సూచించారు.
** తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పుష్కర దారులన్నీ ఇప్పటి నుంచే మరమ్మతులు చేయాలని సూచించారు. ప్రత్యేకించి తాడేపల్లిగూడెం-రాజమండ్రి (వయా నిడదవోలు) పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.
** సభ్యుల సూచనలను ఆయా శాఖల మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్తానని నిమ్మల హామీ ఇచ్చారు.