ఆలస్యంగా వచ్చినా సంచలనం సృష్టిస్తుందనే నమ్మకంతో చిత్ర బృందం
ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని, మొదట మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఇంకా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నందున విడుదలను వాయిదా వేశారు.
చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో పవర్ స్టార్ కనిపించనున్నారు. మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. న్యాయం కోసం యుద్ధం చేయనున్న వీరమల్లు, మే 9వ తేదీన థియేటర్లలో అడుగు పెట్టనున్నారు.
‘హరి హర వీరమల్లు’ చిత్రం మే 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. భారీ మరియు సోలో విడుదల కావడంతో.. ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కరోనా మహమ్మారి మరియు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా చిత్రీకరణ ఆలస్యమైనప్పటికీ.. చిత్ర దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న ఎ.ఎం. జ్యోతి కృష్ణ, ఎక్కడా రాజీ పడకుండా వేగంగా ‘హరి హర వీరమల్లు’ సినిమాని పూర్తి చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’ గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రతిభ గల ఈ సాంకేతిక బృందం, ప్రేక్షకులకు వెండితెరపై మరపురాని అనుభూతిని అందించబోతోంది.
పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో భాగమయ్యారు. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. యానిమల్, డాకు మహారాజ్ చిత్రాలతో ఆకట్టుకున్న బాబీ డియోల్.. ప్రతినాయక పాత్రలో మరోసారి తనదైన ముద్ర వేయనున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, జిషు సేన్గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం, మే 9న బాక్సాఫీస్ దగ్గర గర్జించనుంది.