లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వి రాజ్ చేసిన కామెంట్లు కలకలం రేపాయి. వైసీపీ నేతలను టార్గెట్ చేసినట్టుగా ఉన్న ఆ కామెంట్ల మీద కలకలం రేగడంతో టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో షైన్ స్క్రీన్స్ నిర్మాత సాహు గారపాటితో పాటు విశ్వక్ సేన్ మీడియా ముందుకు వచ్చి అసలేం జరిగిందో వివరించారు. ఇక తాజాగా ఈ అంశం మీద టీం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. లైలా మెగా మాస్ ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ పృధ్వి వ్యక్తం చేసిన ప్రకటనలు పూర్తిగా అతని వ్యక్తిగత అభిప్రాయాలు అని ప్రకటనలో పేర్కొన్నారు.
ఆయన మాటలు పూర్తిగా వ్యక్తిగతం సినిమాలో నటించిన నటీనటులు కానీ, షైన్ స్క్రీన్ టీం లేదా లైలా టీం ఎవరికీ అయన మాట్లాడిన మాటలతో సంబంధం లేదని వెల్లడించారు. మా సినిమా ఎంటర్ టైన్మెంట్, హ్యూమర్ అలాగే జాయ్ తో కలగలిపిన ఒక వేడుక. మేము పాజిటివిటీ, అలాగే లవ్ ను వ్యాప్తి చేయడాన్ని గట్టిగా నమ్ముతాము, మా ఈవెంట్లో వ్యక్తులు చేసే ఎలాంటి రాజకీయ ప్రకటనలను మేము ఆమోదించము లేదా సమర్ధించము అని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఆస్వాదించేందుకు రూపొందించిన వినోదభరితమైన చిత్రం – లైలా స్ఫూర్తిపై దృష్టి సారించాలని మేము ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా కోరుతున్నామని అన్నారు. ఆ విషయంలో మా ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నాయి – ఫిబ్రవరి 14 నుండి థియేటర్లలో మీ అందరినీ అలరించడానికి మేము సిద్ధం అవుతున్నామని అందులో పేర్కొన్నారు.
విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏర్పడిన పృథ్వి రాజ్ కామెంట్స్ వివాదం నేపథ్యంలో సినిమా టీం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ తమకు తెలియకుండా ఈవెంట్లో ఈ విషయం జరిగిందని అన్నారు. అయితే అది జరిగిన తర్వాత 14 ఉదయం లైలా హెచ్డి లింకు పెడతా అంటూ సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారని, అదేవిధంగా వాడి ఖాతాలో మరొకడు బలి అంటూ కామెంట్ చేస్తున్నారని ఎవరో చేసిన తప్పుకు తాను ఎందుకు బలి కావాలని విశ్వక్ సేన్ ప్రశ్నించాడు. తాము భోజనం చేసి ఇంటికి వెళ్లే వరకు అసలు అతను మాట్లాడిన విషయం ఏమిటో తెలియదని, దయచేసి ఎంతోమంది కలిసి పనిచేసిన సినిమాని చంపేయకండి అంటూ ఆయన కోరాడు.
బాయ్ కాట్ లైలా అంటూ 25 వేల ట్వీట్స్ ఏంటి అంటూ ఆయన ప్రశ్నించాడు.. అంతేకాక తాను, ప్రొడ్యూసర్ సాహూ ఉన్నప్పుడు ఇదేవిధంగా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా స్టేజి మీదకు వెళ్లి మైక్ లాక్కుని ఉండేవారమని అన్నాడు. ఇక మా స్టేజ్ మీద జరిగిన విషయానికి దయచేసి క్షమించమని అడుగుతున్నాం, మా సినిమాని చంపేయకండి అన్నారు. ఇక ఈ విషయం మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేమని ఎందుకంటే రెండు రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ముందు ఆ విషయం మీద ఫోకస్ పెట్టి ప్రమోషన్స్ చేసుకుంటామని అన్నారు. ఇక ప్రశ్నలు సంధిస్తున్న మీడియా ప్రతినిధులను మీరు 30, 40 కోట్లు పెట్టి సినిమా తీయండి, అప్పుడు ఎవరు ఇలా బాయ్కాట్ చేస్తామని అంటే అప్పుడు మీ రియాక్షన్ ఏంటో చెప్పండి అంటూ వారిని ఎదురు ప్రశ్నించాడు విశ్వక్సేన్.
సినిమాలో ఎవరో ఒక తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్టేనా? పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలీదు, అతను మాట్లాడిన దానికి సినిమాకు సంబంధంలేదు అని విశ్వక్ అన్నారు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియా లో వేల ట్వీట్స్ అంటే ఎలా సినిమా బ్రతకాలా లేదా ?? చాలా కష్టపడి తీసాము సినిమా, నేను ఈ వివాదం గురించి ఇంతటితో ముగిస్తున్నా, మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు అని కోరాడు.