తెలంగాణలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. ఇటీవలే బీర్ల ధరలు పెరగ్గా.. తాజాగా ఇతర లిక్కర్ ధరలు కూడా పెంచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అయితే బడుగు వర్గాలు ఎక్కువగా సేవించే.. చిఫ్ లిక్కర్ ధరలో ఎలాంటి సవరణ ఉండదని సమాచారం. ఎక్కువ ధరలు కలిగిన లిక్కర్ పైనే.. కాస్త పెంపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై మదింపు జరుగుతుంది. ఎంఆర్పీ ధర ఆధారంగా రేట్ల పెంపు ఉంటుంది. బాటిల్ రేటు రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్పైన కనీసం 10 శాతం పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. రెండు, మూడు రకాల ధరల పెంపు ప్రపోజల్స్ అధికారులు ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. ఆయా విధానాల్లో ఎంత ఆదాయం సమకూరుతుందో కూడా రిప్రజెంటేషన్ ఇస్తారు. వాటిపై ప్రభుత్వం రివ్యూ చేసి.. ఫైనల్గా నిర్ణయం తీసుకుంటుంది. లిక్కర్పై రేట్ల పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాకి ఏడాదికి రూ. 2000 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుంది అన్నది అధికారుల అంచనా.
ఫిబ్రవరి నెలలో తెలంగాణలో బీర్ల రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. దాదాపు 15 శాతం వరకు రేట్లు పెంచారు. ఈ ధరల పెరగడంతో ఒక్కో బీరుపై సగటున రూ.20 నుంచి రూ.30 వరకు ధర పెరిగింది. గతంతో పోలిస్తే ముడి సరుకుల ధరలు పెరగడంతో… రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత బీర్ల ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. లిక్కర్ సప్లై చేసే కంపెనీల నుంచి విజ్ఞప్తులు, పక్క రాష్ట్రాల్లో ధరలపై రీసెర్చ్ చేసిన కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడంతో 15 శాతం ధరలు పెంచుకోవచ్చని చెప్పింది.
రాష్ట్రంలో ఇటీవల బీర్ ధరలు పెంచినప్పటికీ లిక్కర్ ధరలు పెంచలేదు. ఇప్పుడు తాజాగా లిక్కర్ ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువ మంది తాగే చిఫ్ లిక్కర్ను ఈ ధరలు పెంపు నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అమ్ముడు పోతున్న మద్యం క్వాంటిటి చూసినట్లయితే, బీర్ కంటే కొంత తక్కువ విక్రయాలు జరుగుతాయి. 2023-24లో 3.62 కోట్లు కేసుల లిక్కర్ అమ్మకాలు జరగగా, 2024-25లో రెండు శాతం పెరిగినట్లు తెలిపింది.
ధరలు పెరుగుదల ఎక్కువ ధరలు కలిగిన లిక్కర్ పైనేనని అధికారులు చెబుతున్నారు. అది ఏవిధంగా తీసుకోవాలన్న కోణంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. బాటిల్ ధర అయిదు రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్పైన కనీసం పది శాతం పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయిదు వందల విలువ చేసే మద్యం బాటిల్పై కనీసం రూ.50 పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంఆర్పీ ధరను ఆధారంగా ఈ రేట్లు పెరుగుతాయని అధికార యంత్రాంగం భావిస్తుంది.