• నదుల అనుసంధానం ద్వారానే సిరిసంపదలు .
• సమర్ధ నీటి వినియోగంతోనే రాష్ట్రం సస్యశ్యామలం.
• అఖిల భారత ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో మంత్రి నిమ్మల.
నదుల అనుసంధానం, నీటి వనరుల సమర్థ సద్వినియోగంతో రాష్ట్రంలో సిరిసంపదలు సృష్టించవచ్చనే ప్రగాఢ విశ్వాసంతో ముందుకు వెళుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. రాజస్థాన్లోని ఉదయపూర్ లో అఖిల భారత స్థాయిలో జరుగుతున్న 2వ రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల మొదటి రోజు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు ఏనాడో చెప్పిన నదుల అనుసంధాన ప్రక్రియకు గౌరవ ప్రధాని మోదీ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల సమర్ధ నాయకత్వంలో మా రాష్ట్రంలో శ్రీకారం చుట్టాము అన్నారు.
విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు కోట్ల ఎకరాలు భూ విస్తీర్ణం ఉండగా అందులో రెండు కోట్ల ఎకరాలు వ్యవసాయ యోగ్యంగా ఉందని చెప్పారు. రెండు కోట్ల ఎకరాల విస్తీర్ణంలో కోటి ఎకరాలకు ఇంకా నీటి వసతి కల్పించాల్సి ఉందన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందించి రాష్ట్రాన్ని కరవురహిత ప్రాంతంగా చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు. రామానాయుడు చెప్పారు.ఆంధ్రప్రదేశ్ జల చిత్రాన్ని ఆయన వీడియో రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.అందులో ఆంధ్రప్రదేశ్ లోని నీటి వనరులు, చేపడుతున్న సాగు నీటి ప్రాజెక్టులు, జరుగుతున్న పనులు స్పష్టంగా వివరించారు. వికసిత్ భారత్ 2047 లో భాగంగా జల సంరక్షణ అంశాలపై రాష్ట్రంలో చేపట్టబోయే పనులను కూడా ఈసందర్భంగా ప్రస్తావించారు. దేశంలోనే మొదటి సారిగా 2017లో ఎపి వారీమ్స్ టెక్నాలజీని ప్రవేశపెట్టి, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వాటర్ మేనేజ్మెంట్ చేసి సమర్ద నీటి వినియోగాన్ని చంద్రబాదు నాయుడు తీసుకొచ్చారని తెలిపారు. ఈ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా గతంలో కంటే ఈ ఏడాది రిజర్వాయర్లలో అదనంగా 53శాతం, నీటి నిల్వ చేయగలిగామని వివరించారు. స్వర్ణాంధ్ర -2047 లో భాగంగా అమలులోకి తీసుకొచ్చిన వాటర్ పాలసీ ద్వారా భూగర్భ జలాలు పెంపొందించడం, డ్రిప్, మరియు పైప్డ్ ఇరిగేషన్ ను ప్రోత్సహిస్తున్నామన్నారు.
గోదావరి నదిపై నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు అత్యంత విశిష్టమైనదిగా మంత్రి పేర్కొన్నారు.ప్రపంచంలోనే ఎక్కువ సామర్ద్యంతో అనగా 50 లక్షల క్యూసెక్కుల వరద డిశ్చార్జి సామర్థ్యంతో 1128 మీటర్ల పొడవైన స్పిల్ వే నిర్మించినట్టు మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తైతే కృష్ణ, గోదావరి డెల్టాల స్థిరీకరణ జరుగుతుందని, సుస్థిర వ్యవసాయం సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. తద్వారా రాష్ట్ర దశ,దిశ మారగలదన్నారు. రాష్ట్రంలోని సాగు, తాగు, పారిశ్రామిక అవసారాల కోసం మరో 85 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించడంలో రాష్ట్రం అగ్రస్దానంలో ఉండడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశమే కారణమని చెప్పారు. భూగర్భ జలాల్ని కొలిచేందుకు 1810 జియో మీటర్లు ఏర్పాటు చేశామని, దేశంలోనే తొలిసారిగా బోర్ వెల్స్ కు కూడా జియో ట్యాగ్ చేసి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జల సంరక్షణకు సంబందించి, నీటి పొదుపు, వృధాను అరికట్టడం వంటి చర్యలకు సంబందించి తీసుకుంటున్న చర్యలను గణాంకాలతో సహా వివరించారు.
వికసిత భారత్ 2047 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా అన్నపూర్ణగా, తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా నిర్ణయించి దిశా, నిర్దేశం చేశారని, మంత్రి చెప్పారు. ఏపీలో ఉన్న ఐదు ప్రధాన నదులు, 35 మైనర్ నదులు నుంచి జలాలని గరిష్టంగా వినియోగించి రాయలసీమ లాంటి కరవ ప్రాంతాలకు నీటిని తరలించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు వెల్లడించారు.
రాష్ట్రంలోని జలవనరులు అభివృద్ధికి నీటి సంరక్షణకు, పొదుపు చర్యలకు ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన సాగేందుకు ప్రధాని మోధీ, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అందిస్తున్న సహాకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్న చొరవకు, ఇస్తున్న ప్రోత్సాహకానికి రామానాయుడు కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు, రాష్ట్రానికి సంబంధించన మరి కొన్ని ప్రతిపాదిత నీటిపారుదల ప్రాజెక్టులకు పూర్తి స్దాయిలో ఆర్దిక సహాకారంతో పాటు, అన్ని రకాల అనుమతులు ఇవ్వాలని వేదికపైనున్న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను, ఉన్నతాధికారులను కోరారు.