ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టెక్నాలజీని వాడుకుని పాలనలో అనేక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఇటీవల ప్రారంభించిన వాట్సాప్ పాలన ద్వారా డేటా చౌర్యం జరుగుతోందని నిరూపిస్తే తాను రూ.10 కోట్లు కానుకగా ఇస్తానని సవాల్ చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన తర్వాత ఆయన.. వాట్సాప్ పాలన అంశంపై వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ ఫోన్ వాడరని చెప్పారని.. ఇప్పుడు వాట్సాప్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఫోన్ లేని వ్యక్తికి వాట్సాప్ గురించి ఎలా తెలుస్తుందని సెటైర్లు పేల్చారు. 2014-2019 మధ్య తాను ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో డేటా చోరీ జరిగిందని వైఎస్సార్సీపీ ఆరోపించిందని..
గత ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. కేంద్రం ఆధ్వర్యంలోని డిజీలాకర్లో సర్టిఫికెట్లు దాచుకోవడంపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సూచనతో త్వరలో ఎంవోయూ చేసుకుంటామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్పై మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిగా ఉన్నాయని.. ఈ మేరకు ఆ సంస్థ యాజమాన్యంతో చర్చిస్తున్నాయన్నారు. తమకు ప్రజల డేటా అవసరం లేదని.. ఓటర్ లిస్టు మాత్రమే కావాలని.. అది పబ్లిక్ డాక్యుమెంట్ అన్నారు. గత ప్రభుత్వం పనికిమాలిన కేసులు పెట్టి చంద్రబాబును జైల్లో ఉంచారని.. టీడీపీ కార్యకర్తలపైనా అక్రమ కేసులు పెట్టించి వేధించారన్నారు. ఏపీకి రాజధాని ఒకటే.. అభివృద్ధి వికేంద్రీకరణ తమ నినాదమన్నారు. అందుకే జిల్లాల వారీగా పరిశ్రమలు, కంపెనీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం, తిరుపతిలో జరిగిన అభివృద్ధి పనులను చూడాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరినట్లు లోకేష్ తెలిపారు. కేంద్రమంత్రి త్వరలోనే రాష్ట్ర పర్యటనకు వస్తారన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలను తరిమేసిందని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చామన్నారు. అలాగే ఏపీలో ప్రారంభమైని వాట్సాప్ గవర్ననెన్స్ను కేంద్ర మంత్రి అభినందించారని.. ఆయన కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు.
విశాఖలో టీసీఎస్ కార్యాకలపాలు మరో 2 నెలల్లో ప్రారంభమవుతాయన్నారు.