ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు.
వైట్హౌస్లో భేటీ అయిన వీరిద్దరూ వాణిజ్యం, భద్రత సహా పలు ఇతర అంశాలపై చర్చించుకున్నారు.
రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీ చేసేలా అమెరికా నుంచి మరింత చమురు, గ్యాస్ కొనుగోలు చేసేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
ట్రంప్ తమతో వాణిజ్య సంబంధాలున్న దేశాలకు వర్తించేలా పన్నులు పెంచిన తరువాత ఈ సమావేశం జరిగింది.
తమ ఇద్దరి మధ్య అద్భుతమైన స్నేహ సంబంధాలున్నాయని, గత నాలుగేళ్ల కాలంలోనూ ఆ సంబంధాలు అలాగే కొనసాగాయని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
రెండు దేశాలు కలిసి మరింతగా వాణిజ్యం జరపాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు.
ఈ సమావేశం సమయంలో రెండు దేశాలకు చెందిన అధికారులు, కొందరు రిపోర్టర్లు అక్కడే ఉన్నారు.
ట్రంప్, మోదీ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు.
‘వైట్హౌస్లో మళ్లీ మిమ్మల్ని చూడడం నాకు ఆనందంగా ఉంది’ అని మోదీ చెప్పగా మోదీని ఇలా కలుసుకోవడం తనకు దక్కిన గౌరవమని ట్రంప్ అన్నారు.
ట్రంప్ మొదటి టర్మ్ కంటే కూడా ఇప్పుడు రెండింతల వేగంతో తామిద్దరం కలిసి పనిచేస్తామని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ట్రంప్ కూడా మోదీపై ప్రశంసలు కురిపించారు. ‘మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారు, అందరూ ఆ విషయమే మాట్లాడుకుంటున్నారు. మోదీ నిజంగా గొప్ప నాయకుడు’ అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ ప్రశంసల తరువాత మోదీ మాట్లాడుతూ.. భారత్లో ప్రతి ఒక్కరూ అమెరికా సెంటిమెంట్లను గౌరవిస్తారని అన్నారు.
విలేఖరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ… రెండు దేశాలు కలసికట్టుగా ఉంటాయని ట్రంప్ అన్నారు.
‘మేం ఇద్దరం ఎవరినైనా జయించగలం. కానీ, ఒకరినొకరం జయించాలని అనుకోవడం లేదు’ అని ట్రంప్ అన్నారు. తామిద్దరం కలిసి ఎవరినైనా జయించగలమని ట్రంప్ చైనాను ఉద్దేశించి అన్నారు.
అమెరికా, భారత్ ఎన్నికలలో ‘యూఎస్ఎయిడ్’ పాత్ర ఉందా అన్న విలేఖరి ప్రశ్నకు బదులిస్తూ ట్రంప్.. ఉంటే ఉండొచ్చన్నారు.
అమెరికా, భారత అంతరిక్ష సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, అరుదైన భూమి ఖనిజాల గురించి చర్చలు జరుపుతామని చెప్పారు.
లాస్ ఏంజిల్స్, బోస్టన్ లలో కొత్త కాన్సులేట్లను ప్రారంభించే ప్రణాళికల గురించి కూడా ఆయన ప్రకటించారు.
టారిఫ్స్ గురించి అడిగిన ప్రశ్నకు డోనల్డ్ ట్రంప్ బదులిచ్చారు. అది భారత్ అయినా లేదా మరో దేశమైనా పన్నులు వసూలు చేస్తామని ట్రంప్ అన్నారు.
‘మాకు పన్నులు వేసినట్లే మేం కూడా వారికి పన్నులు విధిస్తాం. ఇది అమెరికా పరిపాలనా విధానం. పరస్పర సుంకాలను వర్తింపజేస్తాం. భారత్ మా నుంచి ఎంత వసూలు చేస్తుందో, మేం కూడా వారి నుంచే అంతే వసూలు చేస్తాం” అని ట్రంప్ స్పష్టం చేశారు.
”మేం ఎల్లప్పుడూ ఒకే అభిప్రాయంతో ఉన్నాం. భారత పౌరులు ఎవరైనా చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్నట్లయితే, వారిని స్వదేశానికి తీసుకెళ్లడానికి మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. అలా వచ్చిన వారంతా చాలా సాధారణ కుటుంబాలకు చెందిన పిల్లలు. పెద్ద కలలు, వాగ్దానాల ఎరలో వారు చిక్కుకుంటున్నారు. మానవ అక్రమ రవాణా కారణంగా కొంతమంది ఇక్కడికి వచ్చారు. అమెరికాకు వెళ్తున్నట్లు వారికి కూడా తెలియదు” అని మోదీ అన్నారు.
ట్రాఫికర్ల చేతిలో మోసపోయి చట్టవిరుద్ధంగా అమెరికాలో అడుగుపెడుతున్న యువతను రక్షించడానికి మానవ అక్రమ రవాణాను లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు.