సినీనటుడు, వైసీపీ నేత పోసాని క్రిష్ణమురళిలో ధైర్యం సడలిపోయింది. నెల రోజులకు పైగా రాష్ట్రంలోని జైలు యాత్ర చేస్తున్న ఆయన బెదిరిపోయారు. 70 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతున్న తనను విడిచిపెట్టాలని, రెండు రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణయ్యమంటూ గుంటూరు కోర్టులో బోరున విలపించారు. అయినా, ఆయనకు మోక్షం లభించలేదు. నిబంధనల ప్రకారం సీఐడీ కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోసాని జైలు జీవితం కొనసాగించాల్సివచ్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను దూషించడంతోపాటు వారి కుటుంబ సభ్యులను కించపరిచారని, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో సుమారు 4 కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. మిగిలిన కేసుల్లో విచారణకు నోటీసులివ్వాలని హైకోర్టు సూచించడంతో పోసాని బుధవారం బెయిల్ పై బయటకు వస్తారని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయనపై సీఐడీ నమోదు చేసిన కేసు పెండింగులో ఉండటం, ఆ కేసు కూడా బుధవారమే విచారణ జరగడంతో పోసాని విడుదలకు బ్రేక్ పడింది.
గుంటూరులో కేసు విచారణ నిమిత్తం కర్నూలు నుంచి సీఐడీ పోలీసులు ఆయనను పీటీ వారెంటుపై తీసుకువచ్చారు. వైద్య పరీక్షల అనంతరం బుధవారం రాత్రి జడ్జి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ విచారణ సందర్భంగా పోసాని కన్నీరు పెట్టుకున్నారని చెబుతున్నారు. 70 ఏళ్ల వయసున్న తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నట్లు వాపోయారు. కక్ష ఉంటే కత్తితో నరికేయండని, కానీ ఇలా రాష్ట్రం మొత్తం తిప్పుతూ ఇబ్బంది పెట్టొద్దని పోసాని ప్రాధేయపడినట్లు చెబుతున్నారు. తన ఆరోగ్యం బాగోలేదని, రెండు ఆపరేషన్లు జరిగాయని పోసాని న్యాయమూర్తికి చెప్పుకున్నారు. బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆయన హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది
అయితే విచారణ అనంతరం న్యాయమూర్తి నిందితుడు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో బెయిల్ పై విడుదల అవ్వాల్సిన పోసాని మళ్లీ గుంటూరు జైలుకు వెళ్లాల్సివచ్చింది. మరోవైపు పోసానిపై కేసుల పరంపర కొనసాగుతోంది. తాజాగా బాపట్ల పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. కాగా, పోసానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆయన తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. బెయిల్ పై పోసాని విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని కోర్టుకు నివేదించారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పోసాని కృష్ణ మురళిని పోలీసులు గుంటూరులో జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా రెండు రోజుల్లో తనకు బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ పోసాని కృష్ణ మురళి జడ్జి ఎదుట వాపోయినట్లు తెలిసింది. ఈ మేరకు జడ్డి ఎదుట పోసాని కృష్ణ మురళి భోరున విలపించినట్లు తెలిసింది. తన ఆరోగ్యం బాగాలేదన్న పోసాని కృష్ణ మురళి.. డాక్టర్లు రెండు సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కోర్టులో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం. అలాగే బెయిల్ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోయినట్లు తెలిసింది. మకోవైపు పోసానికి మార్చి 26 వరకూ కోర్టు రిమాండ్ విధించింది.
మరోవైపు సీఐడీ తనపై దాఖలు చేసిన పీటీ వారెంట్ను కొట్టివేయాలంటూ పోసాని కృష్ణ మురళి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను ఏపీహైకోర్టు కొట్టివేసింది. పోసాని కృష్ణ మురళిని పీటీ వారెంట్పై ఇప్పటికే కర్నూలులో అదుపులోకి తీసుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు తెలిపారు. మంగళగిరి మేజిస్ట్రేట్ ఎదుట పోసాని కృష్ణ మురళిని ప్రవేశపెట్టేందుకు కర్నూలు నుంచి పోలీసులు తీసుకొస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. పోసాని కృష్ణ మురళి లంచ్ మోషన్ పిటిషన్ను కొట్టివేసింది.
మరోవైపు విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ అన్నమయ్య జిల్లాకు చెందిన జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిని పోలీసులు తొలుత అరెస్ట్ చేశారు. జనసేన నేత ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లెలో పోసానిపై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి నెలలో పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించింది. దీంతో రాజంపేట జైలుకు తరలించారు. అనంతరం పలుచోట్ల పోసానిపై నమోదైన కేసుల విచారణ కోసం పోలీసులు పోసానిని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పటికే కడప, కర్నూలు, నర్సరావుపేట కోర్టులు ఆయనకు బెయిల్ మంజూరు చేశాయి. దీంతో పోసాని విడుదలకు మార్గం సుగమం కాగా.. తాజాగా సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో విడుదలకు బ్రేక్ పడింది.