తెలంగాణలో జరిగిన ప్రమాద ఘటనలో, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది వివరాలను అధికారులు ప్రకటించారు.
వీరిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, సైట్ ఇంజినీర్తో మరో ఆరుగురు ఉన్నారు.
వీరిలో ఆరుగురు జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీకి చెందిన వారు కాగా, ఇద్దరు రాబిన్స్ ఇండియా కంపెనీకి చెందిన వారు.
వీరంతా ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఖండ్, జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారుగా నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు.
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామం వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో ఈ ప్రమాదం జరిగింది.
1.మనోజ్ కుమార్, ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఉన్నావ్, ఉత్తరప్రదేశ్), తండ్రి పేరు: అర్జున్ ప్రసాద్
2.శ్రీ నివాస్, సైట్ ఇంజినీర్(చందౌలి, ఉత్తరప్రదేశ్), తండ్రి పేరు: రామ్ క్రిత్
3.సందీప్ సాహు, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రిపేరు: జితు సాహు
4.జగ్తా జెస్, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రి పేరు: మఘే జెస్
5.సంతోష్ సాహు, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రి పేరు: కేశ్వర్ సాహు
6.అనూజ్ సాహు, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రి పేరు: రామ్ ప్రతాప్ సాహు
7.సన్నీ సింగ్, జనరల్ ఆపరేటర్ (జమ్మూ కశ్మీర్), తండ్రి పేరు: రామ్ సింగ్
8.గురుప్రీత్ సింగ్, ఎరక్టర్ ఆపరేటర్ (పంజాబ్), తండ్రి పేరు: విర్సా సింగ్
సొరంగంలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.
ఇటీవల ఉత్తరాఖండ్లో జరిగిన సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను ఏవిధంగా బయటకు తీసుకొచ్చారనే దానిపై కూడా అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు.
ప్రమాదానికి ముందు భారీ శబ్దం వచ్చినట్లు కార్మికులు చెప్పారని మంత్రి తెలిపారు.
దోమలపెంట వద్ద సొరంగం పనులు జరుగుతున్న ప్రదేశాన్ని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పరిశీలించారు.
ప్రమాదం ఘటనపై సమీక్షించిన మంత్రి, ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి గల కారణాలను వెల్లడించారు.
”శనివారం ఉదయం పనులు ప్రారంభం కాగానే ఒక వైపు నుంచి నీళ్లు టన్నెల్లోకి రావడం మొదలైంది.
నీళ్లు, మట్టి కలిసిపోయి బురదమయంగా మారినట్లు తెలుస్తోంది” అని చెప్పారు.
ఘటనకు కొన్ని క్షణాల ముందు పెద్ద శబ్దం వచ్చినట్లు మిగతా కార్మికులు చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చెప్పారు.
”బోల్ట్స్ ఊడిపోవడంతో సిమెంట్ సెగ్మెంట్స్ కింద పడినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల విద్యుత్ వైర్లు కూడా తెగిపోయి చీకటిగా మారింది” అని మంత్రి తెలిపారు.
ఆచూకీ లేని ఎనిమిది మంది కోసం గాలింపు చర్యలు జరుగుతున్నట్లు మంత్రి ప్రకటించారు.
సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి దిగింది.
ఈ మేరకు టన్నెల్ వద్దకు సింగరేణి రిస్క్యూ టీం చేరుకున్నట్లుగా అధికారులు చెప్పారు.
ప్రత్యేక మార్గం ద్వారా ఆక్సిజన్ సరఫరాతో టన్నెల్ లోనికి వెళ్లేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.
అయితే, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందికరంగా ఉందని అమ్రాబాద్ సీఐ తెలిపారు
.ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు” అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది.
సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తామని, పూర్తి సహకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రధాని హామీ ఇచ్చినట్లు సీఎంవో తెలిపింది.
ప్రమాద ఘటన, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.
ప్రస్తుత పరిస్థితిని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.
సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని సీఎం సూచించారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (SLBC) వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు సొరంగం పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. అయితే నాలుగు రోజుల క్రితమే ఎడమవైపు సొరంగం పనులు మొదలయ్యాయి.
ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టన్నల్ బోర్ మెషిన్తో పని జరుగుతున్నప్పుడు సొరంగంలో ఏడుగురు కార్మికులు ఉన్నారు. దీంతో ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై లోపలికి పరిగెత్తారు.
ప్రమాద సమయంలో పలువురు కార్మికులు పనులు చేస్తుండగా పైకప్పు పడిపోవడంతో వారంతా గాయపడ్డారు. సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఏడాదిలోపు పనులు పూర్తి కావాలన్న ప్రభుత్వ టార్గెట్తో ఇంజనీర్ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఇరగేషన్ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటనే దానిపై ఇరిగేషన్ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఎన్డీఎస్ఏ స్పందించాలని.. నులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూలి కూలీలు గాయపడటం అత్యంత దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో పది కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వారని… ఏ ఒక్క రోజూ ఇలాంటి ప్రమాదం జరగలేదని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు రోజుల కిందనే పనులు మొదలు పెట్టిందని… అంతలోనే ఈ పెను ప్రమాదం ఎలా జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు? నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఈ ప్రమాదంపై స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇంకా 9 కిలోమీటర్లకు పైగా టన్నెల్ తవ్వాల్సి ఉందన్నారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు.